ప్రబధ్యతే ఇతి ప్రబంధః అనగా ప్రకృష్టమైన బంధం అని ప్రబంధ శబ్దానికి వుత్పత్తి.
ఉత్తమ వస్తువును స్వీకరించి రసగుణాంకారాదుల చేత చక్కగా రచింపబడినదని అర్థం చెప్పవచ్చు.
ప్రాచీన కాలంలో ప్రబంధ శబ్దం కావ్యమను సామాన్యార్థంలో ప్రయోగింపబడినది.
తిక్కన భారతాన్ని ప్రబంధమండలిగా పేర్కొన్నాడు. పురాణ లక్షణాలున్న హరివంశాన్ని ఎఱ్ఱన ప్రబంధమని వ్యవహరించాడు.
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి ప్రబంధ శబ్దం ప్రత్యేకమైన ప్రక్రియా భేదంగా ఏర్పడింది..
పురాణేతిహాసాలనుండి స్వీకరించిన కథను వర్ణనలతో పెంచి కావ్యంగా వ్రాయుటను ప్రబంధములని అంటారు. మహాకావ్యలక్షణాలను కొంతవరకు ప్రబంధ లక్షణాలుగా కూడా స్వీకరించవచ్చు.
పురాణములనుండి గ్రహించిన వస్తువును విస్తరించి వర్ణనలతో వ్రాయుటను ప్రబంధ సామాన్య లక్షణంగా చెప్పవచ్చు.
ఇతివృత్తం, ప్రఖ్యాతం, కల్పితం లేదా మిశ్రములలో ఏదైనా కావచ్చు. మనుచరిత్ర ప్రఖ్యాతమైతే, కళాపూర్ణోదయం కల్పితం, వసుచరిత్రను మిశ్రంగా గుర్తించవచ్చు.
ప్రబంధంలో అంగిరసం శృంగారం, అంగరసాలుగా మిగిలిన రసాలు పోషింపబడతాయి.
సంయోగ, వియోగ శృంగారాలు రెండూ సమప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి.
సాధారణంగా ప్రబంధం 'ఆశీఃనమస్క్రియా వస్తు నిర్దేశాలతో ప్రారంభమౌతుంది. కావ్యాదిలో ఇష్టదేవతావర్ణన, కృతిపతి అతని వంశ ప్రతిష్ఠల వర్ణన, పూర్వకవుల ప్రస్తుతి, కుకవినింద ఉంటాయి.
ప్రతి ఆశ్వాసం చివర ఆశ్వాసాంత పద్యాలు, లేదా గద్యాలు ఉండటం ప్రబంధ భౌతిక లక్షణంగా పేర్కొనవచ్చు.
క్రీ॥శ॥ 13వ శతాబ్దం నుండే ప్రబంధం కావ్యాపరశబ్దంగా వాడుకలో ఉన్నది. నన్నెచోడుని కుమారసంభవం, ఎఱ్ఱన నృసింహ పురాణం, నాచనసోమన ఉత్తరహరివంశం, శ్రీనాథుని శృంగార నైషధం, పిల్లల మర్రి పినవీర భద్రుడని శృంగార శాకుంతలం, కొన్ని ప్రబంధ లక్షణాలున్న గ్రంథాలైనప్పటికీ ప్రబంధములుగా పరిగణించబడలేదు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రబంధం తన పూర్తి సౌష్టవాన్ని పొందటమే గాక, ఆ కాలంలో వచ్చిన గ్రంథాలన్నీ దాదాపుగా ప్రబంధాలే.
ఆంధ్ర కవితా పితామహునిగా కీర్తింపబడ్డ అల్లసాని పెద్దన మనుచరిత్రను, తిమ్మన పారిజాతాపహరణాన్ని, రామరాజభూషణుడు వసుచరిత్రను, పింగళి సూరన కళాపూర్ణోదయాన్ని ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం, శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను, చేమకూర వేంకట కవి విజయవిలాసాన్ని, పొన్నెగంటి తెలగన అచ్చతెలుగు ప్రబంధంగా యయాతి చరిత్రను రచించి ప్రబంధ ప్రక్రియా సారస్వతాన్ని పరిపుష్టం చేసారు.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో వికసించిన ప్రబంధం అనంతర కాలాలలో పుంఖానుపుంఖాలుగా విస్తరించింది. తరువాతి కాలంలో రసాస్వాదనకు పండితుల ప్రకర్షను తెలియజేయడానికే ఇది పరిమితమైనప్పటికీ సారస్వతాభివృద్ధికి ముఖ్యసాధనంగా ఉపకరించింది.