జంతువులు - వాటి నివాసాలు | Animals and their Shelter | 3rd Class EVS
VINAYS INFOMarch 26, 2024
జంతువులు - వాటి నివాసాలు | Animals and their Shelter
ఆరోజు ఆదివారం. మహేశ్, కమల, లత, సలీం, డేవిడ్ తోటకు వెళ్లారు. తోట పక్కనే మహేశ్ వాళ్ల పొలాలున్నాయి. తోటలో,పొలాల్లో వాళ్లకు రకరకాల జంతువులు,పక్షులు కన్పించాయి.
తోటలో అందరూ మధ్యాహ్నం వరకు ఆడుకున్నారు. అక్కడ చాలా మంది పెద్దవాళ్లు చేపలు పడుతున్నారు. మహేశ్ చేపలు పట్టడం చూడడానికి చెరువు దగ్గరకు వెళ్లాడు. చెరువులో, చెరువు గట్టుమీద కూడా రకరకాల జంతువులు కనిపించాయి.
చేపలు నీటిలోనే ఉంటాయి. కొన్ని రకాల పాములు నీటిలో ఉంటాయి; మరికొన్ని నేల మీద ఉంటాయి. కానీ కప్పలు, తాబేళ్లు, మొసళ్లు, ఎండ్రకాయలు వంటివి నీటిలోనూ, నేల మీద కూడా ఉంటాయి.
జంతువులు వేరువేరు స్థలాల్లో నివసిస్తాయి. కొన్ని చెట్లమీద, కొన్ని నీళ్లలోను, కొన్ని నేలపైన, మరికొన్ని నేల లోపల బొరియలు చేసుకుని నివసిస్తాయి.
కొన్ని జంతువులు మన ఇళ్లలో కూడా నివసిస్తాయి. ఇళ్లలో పెంచుకునే జంతువులను "పెంపుడు జంతువులు(Domestic Animals)" అంటారు.
కొన్ని పక్షులు గుడ్లుపెట్టి పిల్లల్ని పొదగడంకోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళతాయి.
అట్లాగే మరికొన్ని పక్షులు వేసవికాలంలోను, చలికాలంలోను అక్కడి వాతావరణానికి తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి. ఇలాంటి పక్షులను "వలసపక్షులు(Migratary Birds)" అంటారు.
జంతువులు మరియు పక్షులు ఒక చోటునుంచి మరో చోటుకు వెళ్లడానికి-కొన్ని నడుస్తూ వెళతాయి, కొన్ని పాకుతూ వెళతాయి, కొన్ని గెంతుతూ వెళతాయి, మరికొన్ని ఎగురుతూ వెళతాయి. ఇంకా కొన్ని ఈదుతూ పోతాయి. ఇందుకోసం అవి వాటి కాళ్లు, రెక్కలు, ఒక్కోసారి తోకను కూడా ఉపయోగిస్తుంటాయి.
మనతో పాటు మన పరిసరాలలో అనేక జంతువులు జీవిస్తుంటాయి. అవన్నీ మనలాంటి జీవులే. గాయపడితే మనలాగే బాధపడతాయి. అందుకే వాటిని బాధపెట్టకూడదు.
ఒకరకం దోమలు కుట్టడంవల్ల మలేరియా వచ్చిందని డాక్టరు చెప్పాడు. దోమలు నిలువ ఉన్న నీటిలో పెరుగుతాయి. మన పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
నిలువ నీటిలో కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి.
కొంత మంది దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వంటివి వాడతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం.కాబట్టి దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడడం మంచిది.
అట్లాగే ఈగలవల్ల కూడా మనకు అనేక నష్టాలు కలుగుతాయి. ఈగలు పెంటకుప్పలమీదా, అపరిశుభ్రమైన ప్రదేశాలలోనూ ఉంటాయి. ఇలాంటిచోట్ల వ్యాధులను కలగచేసే క్రిములు కూడా ఉంటాయి.
మనం తినే ఆహారపదార్థాల మీదికి వచ్చి ఈగలు వాలుతూంటాయి. ఇలా ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి. అందుకే ఆహారపదార్థాలమీద ఈగలు వాలకుండా మూతలు ఉంచాలి.
ఈగలు, దోమలు పెరగకుండా ఉండాలంటే మన పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
చెత్తను చెత్తకుండీలలో వేయాలి. మురుగునీటిమీద దోమలు పెరగకుండా కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులను పిచికారి చేయాలి.
నీటిగుంటలు ఉండకుండా, వాటిలో చెత్తా చెదారమూ వేయకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో, బయట పరిశుభ్రత పాటిస్తే దోమలుండవు.