పద్యము(Padhyamu)
పాఠ్యభాగ ఉద్దేశ్యం : వెయ్యేళ్లకు పైగా తెలుగు సాహిత్యానికి ఆలంబనగా నిలిచిన పద్య ప్రక్రియ మాధుర్యాన్ని, వైవిధ్యాన్ని తెలియ చేస్తూ పద్యం రాయువారికి తగిన సూచనలు చేయటం.
పాఠ్యభాగ సారాంశం : పద్య కవిత్వానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. ప్రాచీన సాహిత్యంలోని సాహిత్య గ్రంథాలతో పాటు శాస్త్రగ్రంథాలు కూడా పద్యాలలోనే రచింపబడ్డాయి. ఉదాహరణకు పావులూరి మల్లన రచించిన గణితశాస్త్రం కానీ, ఆయుర్వేద పుస్తకాలు కానీ, వైద్యగ్రంథాలు కూడా పద్యాల్లోనే రచింపబడ్డాయి. నన్నయకు ముందు నుంచే క్రీ.శ. 940 నాటి కుర్క్యాల శాసనంలో కూడా కంద పద్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పద్యానికి నియమాలు, లయాత్మకమైన నడక ఉండటం వల్ల అందరిని ఆకర్షింపగలిగింది.
( పద్యం అనే పదానికి మార్గం, తోవ, అల్లడం కూర్చటం వంటి అర్థాలున్నాయి. యతి, ప్రాస నియమాలున్నాయి. వీటన్నింటిని కవి సమన్వయం చేస్తూ సృష్టించే నాలుగు పాదాల కూర్పును పద్యం అనవచ్చు. పద్యం అనే పదం "పదగతౌ”” అనే సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది.
నిర్వచనం : యతిప్రాస వంటి ఛందో నియమాలతో కూడిన దానిని పద్యం అంటారు. కవి చెప్పదలచుకున్న విషయాన్ని కళాత్మకంగా, పాఠకులు అనుభూతి చెందేటట్లు నియమాలను పాటిస్తూ రాస్తే దాన్ని పద్యం అనవచ్చు.