ఆర్టికల్ -52 ప్రకారం భారతదేశానికి రాష్ర్టపతి ఉంటారు. ఆయనే దేశంలో అత్యున్నత వ్యక్తి. ఆర్టికల్-53 ప్రకారం.. రాష్ర్టపతి రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్యనిర్వాహక అధికారి, దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. ఆర్టికల్ 53(1) ప్రకారం భారతదేశ కార్యనిర్వహణ మొత్తం రాష్ర్టపతికే అప్పగించారు. ఆయనకు సహాయపడేందుకు ఆర్టికల్ 74(1) ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కాబట్టే ప్రధానమంత్రిని వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా, రాష్ట్రపతిని నామమాత్రపు కార్యనిర్వాహక అధిపతిగా పేర్కొంటారు.
అర్హతలు:
రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి అర్హతల గురించి ఆర్టికల్-58 తెలియజేస్తుంది. దీని ప్రకారం..
1. భారతీయ పౌరుడై ఉండాలి.
2. 35 ఏళ్లు నిండి ఉండాలి.
3. లోక్సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి.
4. అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపరచాలి.
5. నామినేషన్ ఫీజుగా రూ.15,000 చెల్లించాలి. డిపాజిట్ తిరిగి రావాలంటే పోలై చెల్లిన ఓట్లలో కనీసం 1/6 వంతు రావాలి.