ఏమిటి : 2020, 2021 సంవత్సరానికి సంబంధించి.. 29 మంది మహిళలకు నారీశక్తి పురస్కారాలు ప్రదానం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : మహిళా సాధికారతతోనే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయన్న ఉద్దేశంతో.. వివిధ రంగాల్లో ప్రత్యేకంగా కృషి చేసిన మహిళలను ప్రొత్సహించేందుకు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశిష్టమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన 29 మంది మహిళలకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నారీశక్తి పురస్కారాలు అందజేశారు. 2020, 2021 సంవత్సరాలకు గాను మార్చి 8న న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి పాములు పట్టే మహిళ వనిత జాగ్దేవ్ బొరాడె అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమె 50వేలకు పైగా పాముల్ని పట్టుకొని అడవుల్లో విడిచిపెట్టారు. పాముకాటుకి గురైతే తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ.. మహిళా సాధికారతతోనే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయన్న ఉద్దేశంతో వివిధ రంగాల్లో ప్రత్యేకంగా కృషి చేసిన మహిళలకి నారీశక్తి పురస్కారాలను అందజేస్తోంది. వ్యవసాయం, విద్య, సాహిత్యం, కళలు, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) సృజనాత్మకత, దివ్యాంగుల హక్కులు, వన్యప్రాణుల సంరక్షణ, ఎంట్రప్రెన్యుర్షిప్ రంగాల్లో అవిరళ కృషి చేసిన మహిళలకి అవార్డులు అందజేశారు. డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న కథక్ డ్యాన్సర్ సేలీ నందకిశోర్ అగ్వానే కూడా పురస్కారాన్ని అందుకున్నారు.