రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల
నియామకానికి ప్రభుత్వం 2018, ఆగస్టు 30న ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో
కొత్త జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన రోజునే రాష్ట్ర
ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ నోటిఫికేషన్లు
రావడంతో అభ్యర్థులంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కోచింగ్ సెంటర్లలో
సాధన చేస్తున్నారు. అదే స్ఫూర్తితో నూతన నోటిఫికేషన్లోని పోస్టులకు కూడా
ప్రిపరేషన్ కొనసాగిస్తే జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సొంతం
చేసుకోవచ్చు... 
-కొత్త
జోనల్ వ్యవస్థకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శి పోస్టులను జిల్లా క్యాడర్
పోస్టులుగా పరిగణిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ
పోస్టులను కొత్త జిల్లాల ప్రాతిపదికగా రాతపరీక్ష నిర్వహించి భర్తీ
చేయనున్నారు.
-రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరో
4,380 కొత్త పంచాయతీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణలో మొత్తం 1300
గిరిజన తండాలు ఉండగా, 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామని
2018-19 బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది.
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
గ్రామాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యవసాయ, పారిశ్రామిక
రంగాల్లో ప్రగతికి బాటలు వేస్తున్నాయి.
-గ్రామంలో అభివృద్ధి పనులకు
రూపకల్పన చేయాల్సింది గ్రామ కార్యదర్శులే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం
గ్రామానికో కార్యదర్శి ఉండేలా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం
చేపట్టింది. కాబట్టి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రిపరేషన్ ప్లాన్
-పరీక్ష విధానం: రాతపరీక్ష. ఈ పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. 200 మార్కులకుగాను రెండు పేపర్లు ఉంటాయి.
-పేపర్-1: దీనిలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. 100 ప్రశ్నలకు, 100 మార్కులు ఉంటాయి.
-పేపర్-2:
తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్-2018, పంచాయతీరాజ్ వ్యవస్థలు, స్థానిక
సంస్థలు, తెలంగాణ చరిత్ర, పథకాలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 100
ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి.
-ఒక్కొక్క సరైన సమాధానానికి ఒక్కో మార్కు ఉంటుంది.
-ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కుల కోత ఉంటుంది.
-నెగెటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈసారి పకడ్బందీగా సాధన చేయాలి. పరీక్ష విధానం, సిలబస్ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
పేపర్-1
-పేపర్-1లోజనరల్స్టడీస్తోపాటు
మెంటల్ ఎబిలిటీస్కు ప్రాధాన్యమివ్వాలి. పాఠ్యాంశంతో పాటు బిట్స్ కూడా
ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మోడల్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఇందులో
వచ్చే అంశాలను చూద్దాం...
కరెంట్ అఫైర్స్
-వర్తమాన
అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఇందుకు గత ఆరు నెలల సమాచారం సేకరించి
చదవాలి. జాతీయ-అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, సదస్సులు-సమావేశాలు, పర్యటనలు,
వార్తల్లో వ్యక్తులు వంటివాటితో పాటు జనరల్ నాలెడ్జ్పై దృష్టి సారించాలి.
-ఇటీవల
జరిగిన వివిధ క్రీడలు, ట్రంప్-కిమ్ భేటీ, సదస్సులు, వివిధ సూచీల్లో భారత్
స్థానం, ప్రధాని మోదీ పర్యటనలు, నూతన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేరళ
వరదలు, నిఫా వైరస్, దేశ నూతన అధ్యక్షులు, ఇటీవల ప్రకటించిన, ప్రదానం చేసిన
అవార్డులు ముఖ్యమైనవి.
-తెలంగాణ అంశాల్లో పథకాలు, తెలంగాణ
డబ్ల్యూఈ-హబ్, టీఎస్ కాప్ మాస్, తెలంగాణ వార్షిక నివేదికలు, 2018-19
బడ్జెట్, ఐటీ వృద్ధి, ఆదిలాబాద్ డొక్ర, వరంగల్ దరిస్కు భౌగోళిక గుర్తింపు,
వార్తల్లో వ్యక్తులు వంటివి ముఖ్యమైనవి.
జనరల్ సైన్స్
-జీవశాస్త్రం:
జీవులు, మానవశరీర అవయవాలు, గ్రంథులు, నాడీవ్యవస్థ, జ్ఞానేంద్రియాలు,
జీర్ణవ్యవస్థ, ఎంజైమ్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, పోషక పదార్థాలు,
వ్యాధులు-నివారణాంశాలు, హార్మోనులు, విటమిన్లు, కళ్లు, గుండె, మెదడు,
మూలకణాల వంటి అంశాలు.
-ఫిజిక్స్: గ్రహాలు, ధ్వని, వేగం, కాంతి,
ప్రమాణాలు-కొలతలు, పరిశోధనలు-శాస్త్రవేత్తలు, ఉష్ణం, విద్యుత్, విద్యుత్
సాధనాలు, యాంత్రిక శాస్త్రం.
-రసాయన శాస్త్రం: ద్రవపదార్థాలు, మూలకాలు, కిరణాలు, లోహాలు, రసాయనికనామాలు.
పర్యావరణ సమస్యలు-విపత్తు నిర్వహణ
-ప్రపంచ
పర్యావరణ సదస్సులు, అమెరికా-పారిస్ ఒప్పందం, భారత్ కాలుష్య నియంత్రణ
విధానం, కాలుష్యం, ఎస్డీడీ లక్ష్యాలు, తుఫానులు, వరదలు, పిడుగుపాటు
వంటివాటితోపాటు జాతీయ విపత్తు నిర్వహణ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
ఏర్పాటు.
భూగోళశాస్త్రం
-భూమి,
ఇతర గ్రహాలు, గ్రహణాలు, భారత్, తెలంగాణ ఉనికి, భౌగోళిక విస్తరణ, జనాభా, 31
జిల్లాల సమగ్ర సమాచారం, రాష్ర్టాలు-జిల్లాల సరిహద్దులు, శీతోష్ణస్థితి,
వర్షపాతం, అడవులు-హరిత కాకతీయ, నేలల వంటివి.
భారత ఆర్థిక వ్యవస్థ- 2018
-కేంద్ర,
రాష్ర్టాల బడ్జెట్, ఎకనామిక్ సర్వే, పంచవర్ష ప్రణాళికలు-నీతి ఆయోగ్,
వృద్ధి సిద్ధాంతాలు-భావనలు, వ్యవసాయ రంగం- ఫసల్ బీమా యోజన, భూ సంస్కరణలు,
పారిశ్రామిక రంగం, సంక్షేమ-అభివృద్ధి పథకాలు, 2011 జనాభా లెక్కలు, సుస్థిర
అభివృద్ధి, ఆర్థిక సంస్థలు, రవాణా, పేదరికం, జీఎస్టీ, ఎఫ్ఆర్ఐ బిల్లు
వంటి అంశాలు.
-తెలంగాణ పథకాల్లో రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు, గ్రామజ్యోతి వంటివి ముఖ్యమైనవి.
-భారత్,
తెలంగాణ చరిత్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో తెలంగాణ సాయుధపోరాటం,
స్వాతంత్య్ర సంగ్రామం-1857, తెలంగాణ వీరులు, సింధు నాగరికత, ఢిల్లీ
సుల్తానులు-వారి పాలన అంశాలు, కట్టడాలు, కళలు వంటి వాటికి ప్రాధాన్యం
ఇవ్వాలి.
-తెలంగాణ సంస్కృతి, రాష్ట్ర సాధన 1947-56, 1958-2011, 2011-14 వరకు జరిగిన ఉద్యమ ఘట్టాలు చాలా ముఖ్యమైనవి.
-మెంటల్ ఎబిలిటీ: ఇందులో పదో తరగతి వరకు ఇంగ్లిష్, రీజనింగ్, అర్థమెటిక్ ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు చదివితే సరిపోతుంది.
పేపర్-2
-ఈ
పేపర్లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్-2018, పంచాయతీరాజ్ వ్యవస్థలు,
స్థానిక సంస్థలు, తెలంగాణ చరిత్ర, పథకాలు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు
వస్తాయి.
-నూతన పంచాయతీరాజ్ చట్టం-2018 బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం
ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి
కృష్ణారావు మార్చి 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మార్చి 29న తెలంగాణ
పంచాయతీరాజ్ బిల్లు-2018 కి అసెంబ్లీ ఆమోదం పొందింది.
-స్వాతంత్య్రం
వచ్చి 71 ఏండ్లయినా, చట్టాలు ఎన్ని వచ్చినా గ్రామీణ వ్యవస్థలో మార్పు అంతంత
మాత్రంగానే ఉంది. నూతన పంచాయతీరాజ్ చట్టం-2018తో రాష్ట్రంలో స్థానిక
స్వపరిపాలన వ్యవస్థ బలపడనుంది. రాష్ట్ర సంక్షేమ పథాకాల అమలు కూడా సుగమం
అవుతుంది.
-నూతన పంచాయతీ చట్టం ప్రకారం రాష్ట్రంలో 12,571
గ్రామపంచాయతీలు, 147 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి. ఇకపై
నగరపంచాయతీలు ఉండవు. పంచాయతీలకు పదేండ్లపాటు ఒకే రిజర్వేషన్ అమల్లో
ఉంటుంది. సర్పంచ్, ఉపసర్పంచ్లకు చెక్పవర్ ఉంటుంది. ఇది నిధుల పారదర్శకతకు
ఉపయోగపడుతుంది.
-దేశంలో ప్రథమంగా శాసనసభ ద్వారా గ్రామపంచాయతీని
ఏర్పాటు చేశారు. దీని ప్రకారం 243 అధికరణం, సెక్షన్ (3)(ఎ) ద్వారా ప్రతి
ఏడాది ఆరుసార్లు గ్రామసభ నిర్వహించాలి. అంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి
గ్రామసభ నిర్వహించాలి. ఇందులో ప్రజాసమస్యలపై ముఖ్యంగా స్త్రీల సమస్యలపై,
పథకాలపై చర్చించాల్సి ఉంటుంది.
-అయితే పీఆర్-2018 ప్రకారం గ్రామసభను
కోరం ప్రకారమే నిర్వహించాలి. ప్రతి గ్రామంలో జనాభా ప్రాతిపదికన ఒక కోరం
ఏర్పాటవుతుంది. 500 ఓటర్లు ఉంటే 50 మంది సభ్యులు, 500-1000 ఓటర్లు ఉంటే 75
మంది సభ్యులు, 10,000 మందికి పైగా ఓటర్లు ఉంటే 400 మంది సభ్యులతో కోరం
ఏర్పాటు చేసుకోవాలి.
-సర్పంచ్లు, వార్డు సభ్యులలో 50 శాతం మహిళలకు
కేటాయించారు. తండా పంచాయతీల్లో సర్పంచ్ పదవుల కోసం స్త్రీలకు రిజర్వేషన్
కల్పించారు. 1300 తండాలను పంచాయతీలుగా గుర్తించారు. బీసీలకు జనాభా ఆధారంగా
34 శాతం రిజర్వేషన్ కేటాయించారు.
-గ్రామపంచాయతీల సమావేశంలో
పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, శ్మశానవాటికల నిర్వహణ, నర్సరీల ఏర్పాటు,
చెట్లను పెంచడం, చెట్లను నరికినా, రోడ్లను ఆక్రమించినా జరిమానా విధించడం
వంటి ప్రణాళికలను రూపొందించాలి.
-పంచాయతీరాజ్ విస్తరణ అధికారిని
నియమించి, పంచాయతీ కార్యదర్శి పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీచేసే బాధ్యతను
అతనికి అప్పజెప్పింది. పంచాయతీ కార్యదర్శి గ్రామసభ నిర్వహించడంతోపాటు
గ్రామంలో రోజువారీ పరిపాలన బాధ్యతలు నిర్వహించాలి.
-తాగునీటి వసతులు
కల్పించడం, నల్లాల మరమ్మతులు చేపట్టడం, మిషన్ భగీరథ ద్వారా నీరు అందించడం,
పారిశుద్ధ్యం-స్వచ్ఛ తెలంగాణకు సహకరించడం, హరితహారం బాధ్యతలను నిర్వహించడం,
ప్రతి గ్రామంలో చెట్లను పెంచడం, కాలుష్యాన్ని నివారించడం, అటవీ సంపదను
కాపాడటం, సాగునీరు అందించడం, మిషన్ కాకతీయ పనులు నిర్వహించడం, చెరువులు,
బోర్లు, బావుల మరమ్మతులు చేపట్టడం వంటివి గ్రామకార్యదర్శి బాధ్యతలు.
-గ్రామ పంచాయతీల్లో భవనాలు, లేఅవుట్ల నిర్మాణాలకు అనుమతులపై కూడా పీఆర్ యాక్ట్-2018లో స్పష్టమైన నిబంధనను పొందుపర్చారు.
-ఆర్టికల్
243H ప్రకారం ఆస్తి, వృత్తి పన్నులను వసూలుచేసి వాటిని గ్రామ అభివృద్ధికి
ఉపయోగించాలి. ఇలా పంచాయతీ రాజ్-2018 చట్టాన్ని జూనియర్ పంచాయతీ
కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు బాధ్యతాయుతంగా నిర్వహించాలి. వీరి
విధులను జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ), పంచాయతీ
విస్తరణాధికారి (ఈఓపీఆర్డీ) పర్యవేక్షిస్తారు.