Type Here to Get Search Results !

Vinays Info

Current Affairs

కాళేశ్వరం సీఈకి అవార్డు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజినీర్ నల్లా వెంకటేశ్వర్లుకు ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా సెప్టెంబర్ 15న నిర్వహించిన ఇంజినీర్స్ డే వేడుకల్లో ఈ అవార్డును అందజేశారు.

నృత్యకారిణి భావనారెడ్డికి పురస్కారం

ప్రఖ్యాత కూచిపూడి గురువులు రాజారెడ్డి, కౌసల్యా రెడ్డిల కుమార్తె భావనారెడ్డికి కేంద్ర సంగీత నాటక అకాడమీ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం-2017 లభించింది. సెప్టెంబర్ 15న మేఘాలయలోని షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ తథాగతరాయ్ ఈ అవార్డును ఆమెకు అందజేశారు.

వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ మృతి

వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ అనారోగ్యంతో రాజధాని హనొయిలో సెప్టెంబర్ 21న మృతిచెందారు. ఆయన 2016లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఆర్చరీ కోచ్ జీవన్‌జ్యోత్ రాజీనామా

భారత ఆర్చరీ కాంపౌండ్ విభాగం జట్టు కోచ్ జీవన్‌జ్యోత్ సింగ్ తన పదవికి సెప్టెంబర్ 21న రాజీనామా చేశారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే జాతీయ క్రీడా పురస్కారం ద్రోణాచార్య జాబితా నుంచి జీవన్‌జ్యోత్ పేరును తొలగించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఏఐ డైరెక్టర్‌గా పురందేశ్వరీ

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తున్నట్లు కేంద్ర క్యాబినెట్ సెప్టెంబర్ 20న ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆమె ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగుతారు.

మాజీ ఫుట్‌బాలర్ లతీఫుద్దీన్ మృతి

అంతర్జాతీయ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సయ్యద్ లతీఫుద్దీన్ అనారోగ్యంతో హైదరాబాద్‌లో సెప్టెంబర్ 19న మృతిచెందాడు. ఆయన తెలంగాణ పది జిల్లాల ఫుట్‌బాల్ సంఘం అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆయన తండ్రి నూర్ మహ్మద్ కూడా ఫుట్‌బాల్ క్రీడాకారుడే.
National
Modi-presentS.jpg

ఆయుష్మాన్ భారత్ ప్రారంభం

దేశంలో పేదకుటుంబాల వారందరికీ వర్తించేలా చేపట్టిన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌ను ప్రధాని మోదీ సెప్టెంబర్ 23న జార్ఖండ్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద గుండె, మూత్రపిండాలు, కాలేయ జబ్బులు, మధుమేహంలతో సహా 1300 పైగా రుగ్మతలకు చికిత్సలు అందిస్తారు. ఒక కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల వరకు బీమా లభిస్తుంది. దీనివల్ల 8.03 కోట్ల గ్రామీణ, 2.33 కోట్ల మంది పట్టణ కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.

లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్

మహిళలు, చిన్నారులపై జరగుతున్న లైంగిక నేరాలను అరికట్టేందుకు లైంగిక నేరస్తుల జాతీయ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌ఎస్‌ఓ)ను కేంద్రం సెప్టెంబర్ 21న ప్రారంభించింది. దీనిలో 4.40 లక్షల మంది నేరస్తుల పేర్లు, చిరునామా, వేలిముద్రలు, ఆధార్, పాన్, డీఎన్‌ఏ నమూనాలను పొందుపర్చారు.

దేశంలో 27.5 శాతానికి తగ్గిన పేదరికం

ప్రపంచ బహుముఖ పేదరిక సూచీ (ఎంపీఐ)-2018ని యూఎన్‌డీపీ, ఆక్స్‌ఫర్డ్ పేదరిక, మానవవనరుల అభివృద్ధి నివేదిక (ఓపీహెచ్‌ఐ) సెప్టెంబర్ 20న సంయుక్తంగా విడుదల చేశాయి. దీని ప్రకారం 2005-06 నుంచి 2015-16 మధ్యకాలంలో 54.7 శాతంగా ఉన్న బహుముఖ పేదరికం 27.5 శాతానికి తగ్గింది. ఈ సూచీ ప్రకారం బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో బహుముఖ పేదరికం ఉంది. ఈ నాలుగు రాష్ర్టాల్లో సుమారు 19.6 కోట్ల మంది పేదలు ఉన్నారు. భారత్‌లో ప్రస్తుతం 36.4 కోట్ల మందికి ఆరోగ్యం, పోషకాహారం, పాఠశాల విద్య, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు అందడంలేదు. ఆసియా దేశాలైన నేపాల్ (35.3 శాతం), బంగ్లాదేశ్ (43.9 శాతం), పాకిస్థాన్ (43.9 శాతం)లలో కూడా బహుముఖ పేదరికం ఎక్కువగా ఉంది.

ఐఐసీకు శంకుస్థాపన

ఢిల్లీలో నిర్మించనున్న ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసీసీ)కు ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న శంకుస్థాపన చేశారు. ఐఐసీసీ భవిష్యత్తులో పరిశ్రమలు, స్టార్టప్‌లకు కేంద్రంగా నిలుస్తుందని, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు దోహదపడుతుందని ప్రధాని అన్నారు. 2022 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపై 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.

ప్రహార్ క్షిపణి పరీక్ష విజయవంతం

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి అయిన ప్రహార్‌న భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాతీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సెప్టెంబర్ 21న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణి అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది.

పది బ్యాంకులకు సీఈఓల నియామకం

దేశంలోని పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలను నియమిస్తూ నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రాబ్యాంక్ జే ఫకీర్‌స్వామి, సిండికేట్ బ్యాంక్ మృత్యుంజయ్, ఇండియన్ బ్యాంక్ పద్మజా చంద్రు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పల్లవ్ మహాపాత్ర, దేనా బ్యాంక్ కర్నమ్ శేఖర్, అలహాబాద్ బ్యాంక్ ఎస్‌ఎస్ మల్లికార్జునరావు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏఎస్ రాజీవ్, యూకో బ్యాంక్ అతుల్ కుమార్ గోయల్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎస్ హరిశంకర్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అశోక్ కుమార్ ప్రధాన్ సీఈఓలుగా నియమితులయ్యారు.

ట్రిపుల్ తలాక్ నిషేధానికి ఆర్డినెన్స్

ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధించే ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ సెప్టెంబర్ 19న ఆమోదం తెలిపింది. 2017, ఆగస్టు 22న ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. ఈ ట్రిపుల్ తలాక్‌ను ప్రపంచవ్యాప్తంగా 21 దేశాలు నిషేధించాయి.

అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం ప్రారంభం

వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రధాని మోదీ సెప్టెంబర్ 18న ప్రారంభించారు. వారణిసిని తూర్పు భారత గేట్‌వేగా తీర్చిదిద్దుతామని మోదీ అన్నారు. 2019, జనవరిలో ప్రపంచ ప్రవాస భారతీయ దివస్‌ను వారణాసిలో నిర్వహించనున్నారు.

క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు

జార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ లిస్ట్-ఎ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సెప్టెంబర్ 20న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో నదీమ్ 10 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 8 వికెట్లు (హ్యాట్రిక్ సహా) తీశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ బౌలర్ రాహుల్ సంఘ్వీ (8/15) పేరుతో ఉన్నది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డు చమిందావాస్ (8/19) పేరుతో ఉన్నది.International
ferguson-cover.jpg

టైమ్ మ్యాగజీన్ అమ్మకం

అమెరికాకు చెందిన ప్రఖ్యాత మ్యాగజీన్‌ను రూ. 1,377 కోట్లకు (190 మిలియన్ డాలర్లు) క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ మార్క్ బెనియాఫ్ సెప్టెంబర్ 17న కొనుగోలు చేశారు. మెరిడిత్ కార్పొరేషన్‌కు చెందిన ఈ మ్యాగజీన్‌ను యేల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు హెన్రీ లూస్, బ్రిటనా హడెన్‌లు కలిసి 1923, మార్చిలో ప్రారంభించారు.

జపాన్ ప్రధానిగా అబే

జపాన్ ప్రధానమంత్రిగా షింజో అబే సెప్టెంబర్ 20న మరోమారు ఎన్నికయ్యారు. ఆయన 2021 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

చీఫ్ జస్టిస్‌పై దేశ బహిష్కరణ

బంగ్లాదేశ్ మొదటి హిందూ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కే సిన్హాపై ఆ దేశ ప్రభుత్వం దేశ బహిష్కరణ విధించింది. 2017లో చీఫ్ జస్టిస్‌గా నియమితులైన ఆయన ఏ బ్రోకెన్ డ్రీమ్: రూల్ ఆఫ్ లా, హ్యూమన్ రైట్స్ అండ్ డెమొక్రసీ అనే పుస్తకాలు రాశారు.

జీ-7 దేశాల సదస్సు

జీ-7 దేశాల మంత్రుల సదస్సు కెనడాలోని హాలిఫాక్స్‌లో సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు జరిగింది. కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, అమెరికాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, సముద్ర జలాల వినియోగం, స్వచ్ఛ ఇంధనం వంటి అంశాలపై చర్చించారు. నార్వే, వియత్నాం, దక్షిణాఫ్రికా, కెన్యా, అర్జెంటీనా దేశాలు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నాయి.

మోర్‌ను కొనుగోలు చేసిన అమెజాన్

ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన మోర్ సూపర్ మార్కెట్‌ను ఇంటర్నేషనల్ రిటైల్ రంగ సంస్థ అమెజాన్, సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేశాయి. సుమారు రూ. 4200 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో సెప్టెంబర్ 19న ఒప్పందం కుదుర్చుకున్నాయి.Telangana
AEKKA-YADAGIRI-RAO.jpg

ఐశ్వర్యకు టెన్సింగ్ నార్కే అవార్డు

భారత నౌకాదళంలో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేస్తున్న ఐశ్యర్య బోడపాటికి 2017కు గాను టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచరస్ అవార్డు లభించింది. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడలశాఖ ప్రకటించే ఈ అవార్డును ఆమె సెప్టెంబర్ 25న రాష్ట్రపతి భవన్‌లో అందుకున్నారు.

ఎక్కా యాదగిరికి డాక్టరేట్

ప్రముఖ శిల్పాచార్యులు ఎక్కా యాదగిరికి గీతం యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని గీతం క్యాంపస్‌లో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు.

ప్రభాకరరావుకు స్కోచ్ అవార్డు

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుకు కార్పొరేట్ ఎక్సలెన్స్ విభాగంలో 2018కి గాను స్కోచ్ అవార్డు లభించింది. ఈ నెల 19న ఢిల్లీలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section