శాతవాహన యుగం
శాతవాహన యుగం
-దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులది. దక్షిణ భారతదేశంలో తొలి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుదీర్ఘకాలంపాటు రాజకీయ సమైక్యతను కల్పించిన ఘనత వీరిది. సుమారు రెండున్నర శతాబ్దాలు పరిపాలించిన వీరి కాలంలో దక్షిణ భారతదేశంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రగతిశీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీరి కాలంలో సాహిత్య, వాస్తు, శిల్పకళలకు గొప్ప ఆదరణ లభించింది.
-మౌర్యుల కాలంలో సామంతులుగా ఉండి కణ్వ వంశ కాలంలో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోటిలింగాలవద్ద వీరి పాలన ప్రారంభమై తరువాత ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా, మలిశాతవాహనుల కాలం నాటికి ధనకటకాన్ని (ధాన్యకటకం లేదా అమరావతి) రాజధానిగా చేసుకొని పాలించారు.
-వీరు ఉత్తరభారతదేశంలో మగథ వరకు తమ దిగ్విజయయాత్రను నిర్వహించారు. శాతవాహన సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు వ్యాపించింది. శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి గుర్తించదగిన సాంస్కృతిక సేవను అందించారు.