Type Here to Get Search Results !

Vinays Info

CURRENT AFFAIRS

Telangana
Haritha-Haram

జయశంకర్ వ్యవసాయ వర్సిటీ టాప్

వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దక్షిణ భారతదేశంలోనే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. భారత వ్యవసాయ పరిశో ధనామండలి (ఐకార్) రాష్ట్ర వ్యవసాయ వర్సీటీల ర్యాకులను ప్రకటించింది. ఇందులో జయశంకర్ వ్యవసాయ వర్సిటీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉంది. గతేడాది ఈ వర్సిటీ 12వ ర్యాంకులో ఉన్నది.

నాలుగో విడత హరితహారం

నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఆగస్టు 1న గజ్వేల్‌లో కదంబ మొక్క నాటి ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో భాగ్యమ్మ ఇంటిలో కొబ్బరిమొక్కను నాటారు.

లైఫ్ సైన్సెస్ పోర్టల్ ఆవిష్కరణ

లైఫ్ సైన్సెస్ రంగంతో ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లను అనుసంధానం చేసేందుకు వెబ్‌పోర్టల్‌ను ఐటీ మంత్రి కేటీఆర్ జూలై 31న ప్రారంభించారు.

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఆర్కే జైన్

కృష్ణా బోర్డు నూతన చైర్మన్‌గా ఆర్కే జైన్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది. కృష్ణా, గోదావరి బోర్డులకు చైర్మన్‌గా పనిచేసిన హెచ్‌కే సాహు జూలై 31న పదవీవిరమణ చేశారు. ఆయన స్థానంలో కేంద్ర జలసంఘం బెంగళూరు రీజియన్‌లో పనిచేస్తున్న జైన్‌ను నియమించింది.

నాబార్డు సీజీఎంగా విజయ్‌కుమార్

తెలంగాణ నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా విజయ్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు నాబార్డు జూలై 31న వెల్లడించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన ఇప్పటివరకు జమ్ముకశ్మీర్ రాష్ట్ర సీజీఎంగా పనిచేశారు.

ఐపీఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గోపాల్‌రెడ్డి

ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ (ఐపీఎస్‌ఏ) ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఓయూ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయనను సభ్యుడిగా ఎన్నుకున్నారు.

చేనేతకు పురస్కారం

రాష్ట్రంలో చేనేత వస్ర్తాల ఉత్పత్తిలో విశేష కృషిచేసిన కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో పురస్కారాలు అందించనున్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

నిపుణ ప్రభంజనం

ఉద్యోగార్థులకు గైడెన్స్, అత్యంత నాణ్యమైన కంటెంట్ ఇవ్వటంలో అందరికంటే ముందుండే నిపుణ మరోసారి సత్తా చాటింది. జూలై 29న టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జనరల్ స్టడీస్ పేపర్లో ఒక్క కరంట్ అఫైర్స్ విభాగంలోనే నిపుణ తన పాఠకులకు గతంలో అందించిన కంటెంట్ నుంచి ఏకంగా 36 ప్రశ్నలు రావటం విశేషం. పోటీ పరీక్షల విద్యార్థులకు బోధించటంలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న వేముల సైదులు నిపుణ ద్వారా అందిస్తున్న నాణ్యమైన కరంట్ అఫైర్స్ కంటెంట్‌వల్ల వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని తెలియజేయటానికి గర్విస్తున్నాం. వేముల సైదులు కరంట్ అఫైర్స్ పుస్తక రచయిత కూడా.. Sports
Sindhu

సింధుకు రజతం

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్‌గా నిలిచింది. ఆగస్టు 5న నాన్‌జింగ్ (చైనా)లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో కరోలినా మారిన్ (స్పెయిన్) 19-21, 10-21తో సింధుని ఓడించింది. ఈ మెగా ఈవెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా మారిన్ నిలిచింది.మొత్తంగా సింధు ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో నాలుగు పతకాలు సాధించింది. గతంలో 2013, 14లో కాంస్యాలు, 2017, 18లో రజతాలు నెగ్గింది.
పురుషుల సింగిల్స్‌లో కెంటో మొమోటా ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. షి యుకి (చైనా)పై ఫైనల్లో మొమోటా విజయం సాధించాడు.

టెస్ట్ నం. 1 బ్యాట్స్‌మెన్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో 149, 50 పరుగులు చేయడంతో 334 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీంతో ఇప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (329 పాయింట్లు)ను వెనక్కి నెట్టాడు. భారత్ తరఫున సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంబీర్ ఐఐసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు.

భారత రెజ్లింగ్‌కు స్పాన్సర్‌గా టాటా

భారత రెజ్లింగ్‌కు స్పాన్సర్‌గా దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వ్యవహరించనుంది. ప్రధాన స్పాన్సర్‌గా మూడేండ్లపాటు ఉంటుంది. International
Emarson

ఏఐబీడీ

ఆసియా-పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ డెవలప్‌మెంట్‌కు (ఏఐబీడీ) అధ్యక్ష స్థానాన్ని భారత్ దక్కించుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆగస్టు మూడో తేదీన జరిగిన 44వ వార్షిక సమావేశంలో అధ్యక్ష స్థానంకోసం జరిగిన ఓటింగ్‌లో ఇరాన్‌ను భారత్ ఓడించింది. ఏఐబీడీ ఎగ్జిక్యూటివ్ చైర్‌గా ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ ఎఫ్ శహర్యార్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ పదవుల కాలపరిమితి రెండేండ్లు. ఏఐబీడీని 1977లో స్థాపించారు.

డిజిటల్ లిటరసీ లైబ్రరీ

సామాజిక మాధ్యమవేదిక ఫేస్‌బుక్ కొత్తగా డిజిటల్ లిటరసీ లైబ్రరీని ప్రారంభించింది. ఆన్‌లైన్ టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో 11-18 ఏండ్ల మధ్య వయసున్న యువతకు ఈ లైబ్రరీ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు.

ఏక క్రోమోసోమ్ ఈస్ట్

ఒకే క్రోమోసోమ్ ఉన్న ఈస్ట్‌ను అభివృద్ధి చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. చైనాలోని సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ మాలిక్యులార్ ప్లాంట్ సైన్సెస్ శాస్త్రవేత్తలు 16 క్రోమోసోమ్‌లు ఉండే బ్రెవర్స్ ఈస్ట్‌పై పరిశోధనలు చేసి ఒకే క్రోమోసోమ్ ఈస్ట్‌ను పున:సృస్టి చేశారు. 16 క్రోమోసోమ్‌లలో ఉండే జీవ క్రియలన్నింటినీ ఒకే క్రోమోసోమ్‌లో అమర్చారు.

జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమర్సన్

జింబాబ్వే నూతన అధ్యక్షుడిగా ఎమర్సన్ మునంగాగ్వా ఎన్నికయ్యారు. గతేడాది నవంబర్‌లో రాబర్ట్ ముగాబేను గద్దెదించిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఆయన 50.8 శాతం ఓట్లతో విజయం సాధించారు. National
Gopalakrishna-gandhi

సుప్రీంకు ముగ్గురు కొత్త జడ్జీలు

కొత్తగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమి తులయ్యారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 4న ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సుప్రీంలో మొత్తం జడ్జీల సంఖ్య 25కు చేరింది.

ముగ్గురు మహిళా జడ్జీలు

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా ముగ్గురు మహిళలు ఏకకాలంలో జడ్జీలుగా ఉన్నారు. మద్రాస్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో మహిళా న్యాయమూర్తుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా సుప్రీం జడ్జీలుగా విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ ఇందిరాబెనర్జీ 8వ మహిళా న్యాయమూర్తి. జస్టిస్ ఫాతిమా బీబీ తొలి మహిళా జడ్జి.

గోపాలకృష్ణ గాంధీకి సద్భావన అవార్డు

ప్రతిష్ఠాత్మక రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డుకు పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనుమడు గోపాల్‌కృష్ణ గాంధీ ఎంపికయ్యారు. జాతీయ సమగ్రత, మత సామరస్యం, శాంతి కోసం పాటుపడేవారికి ఏటా ఈ అవార్డును ఆగస్టు 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ప్రదానం చేస్తారు.

కశ్మీర్ తొలి మహిళా సీజేగా జస్టిస్ గీతా

జమ్ముకశ్మీర్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గీతా మిట్టల్ నియమితులయ్యారు.

అధ్యాపకుల్లో 42 శాతం మహిళలు

దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లోని అధ్యాపకుల్లో 42 శాతం మంది మహిళలు ఉన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సేకరించిన గణాంకాల ప్రకారం 2017-18 విద్యాసంవత్సరంలో బోధనా రంగంలో 58 (7,45,158)శాతం మంది పురుషులు ఉండగా, 42 శాతం (5,39,597) మహిళలు ఉన్నారు. బీహార్ (20.9 శాతం), జార్ఖండ్ (29.9 శాతం), ఉత్తరప్రదేశ్ (32.8 శాతం) రాష్ర్టాల్లో మహిళా అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉన్నది.

రైల్వే కూడలికి దీన్‌దయాళ్ పేరు

ఉత్తరప్రదేశ్‌లోని ముగల్‌రాయ్ రైల్వే కూడలికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త దీన్‌దయాల్ ఉపాధ్యాయ పేరును ఆగస్టు 5న అధికారికంగా ప్రకటించారు.

రాజ్యసభకు అధ్యక్షత వహించిన పర్వీన్

గత పదేండ్లలో తొలిసారి ఓ మహిళ రాజ్యసభకు అధ్యక్షత వహించారు. తొలిసారి సభ్యురాలిగా ఎన్నికైన జేడీయూకి చెందిన కహక్‌శాన్ పర్వీన్ ఆగస్టు 2న ప్రశ్నోత్తరాల సమయంలో అధ్యక్షత వహించారు.

ఉత్తమ పార్లమెంటేరియన్లు

2014-17 కాలానికిగాను ఉత్తమ పార్లమెంటేరియన్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 1న అవార్డులు అందించారు. ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డును కాంగ్రెస్ నేత ఆజాద్ అందుకోగా, నజ్మా హెప్తుల్లా, హుకుమ్‌దేవ్ నారాయణ్ యాదవ్, దినేశ్ త్రివేది, భర్తృహరి మహతాబ్‌లు అవార్డులు అందుకున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section