షహాబుద్దీన్ ముహమ్మద్ షాహ్ జహాఁ (ఆంగ్లం : Shabuddin Mohammed Shah Jahan) పూర్తి పేరు అల్ హజ్రత్ అబుల్-ముజాఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్ షాజహాన్ (బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్-ఖాఖాన్ అల్-ముకర్రం, అబుల్-ముజఫ్ఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్, సాహిబే ఖిరానే సాని, షాహ్ జహాఁ I పాద్షాహ్ గాజి జిల్లు'ల్లాహ్ [ఫిర్దోస్-ఆషియాని]) (ఇంకనూ షాహ్ జహాఁ, షాజెహాన్, షాజహాన్, షాజహాను అని కూడా పలుకుతారు. (ఉర్దూ : شاه جهان), జననం జనవరి 5, 1592 ; మరణం జనవరి 31, 1666. మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి, 1628 నుండి 1658 వరకూ భారతదేశాన్ని పరిపాలించాడు. షాజహాన్ పదము పర్షియన్ భాషా పదము, అర్థం ; షాహ్ "రాజు", జహాఁ "ప్రపంచం", "ప్రపంచపు రాజు". బాబరు, హుమాయూన్, అక్బరు మరియు జహాంగీరు ల తరువాత ఇతను ఐదవ మొఘల్ చక్రవర్తి.
జహాంగీరు తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలం 'మొఘల్ సామ్రాజ్యంలో స్వర్ణయుగం' అని భావిస్తారు. తాను అక్బరును ఆదర్శంగా తీసుకున్నాడని ప్రతీతి.
సంతానం
జహాఁ ఆరా
దారాషుకో షుజ ఔరంగజేబ్ మురాద్ బక్ష్
ఇతని కాలంలోని నిర్మాణాలు
షాజహాను దర్బారు
షాజహాను, తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన తాజ్ మహల్.
ఎర్రకోట (ఢిల్లీ)
జామా మస్జిద్ (ఢిల్లీ)
దీవాన్ ఎ ఆమ్ (ఎర్రకోట, ఢిల్లీ)
దీవాన్ ఎ ఖాస్ (ఎర్రకోట, ఢిల్లీ)
తాజ్ మహల్ (ఆగ్రా)
మోతీ మస్జిద్ (ఆగ్రా)
నెమలి సింహాసనం (ఆగ్రా) మొదలగునవి.
పరిపాలన
షాజహాన్ చక్రవర్తి స్వభావమునుగూర్చి చరిత్రకారులలో అభిప్రాయభేధములు కలవు. విన్సెంటుస్మిత్తు అనే చరిత్రకారుడు షాజహాన్(SHAJAHAN) ముక్కోపీనియు, అతిక్రోధమును, అతిదయను చూపుచుండెడివాడనియు, విషయలోలుడని వ్రాసెను. ఎల్ఫిన్ స్టన్ అనునాతడు షాజహాన్ దయాళుడనియు, మహనీయుడని వ్రాసియున్నారు. ఏదియెట్లున్నను విద్యా విషయమందు ఈ చక్రవర్తి యొనర్చిన విశేష కార్యములేవియులేవు. బాద్షానామా, ముంతఖాబుల్ లుబాబ్ అను రెండు చరిత్రములు మాత్రము ఈతని ప్రోత్సాహముతో లిఖింపబడినవి. ధిల్లీనగరమున జమా మసీదునొద్ద ఒక కళాశాలను నిర్మించినాడు. షాజహానుకు గానమునందు, శిల్పకళయందు ప్రీతి మెక్కువ. ఈతడాదరించిన గాయకులలో రామదాస్, మహాపత్తర్ అను హిందువులు ముఖ్యులు. ఈతని కుమారుడు దారా మిగుల పండితుడిగా ఖ్యాతి నొందెను. పర్షియన్, అరేబిక్, సంస్కృతం భాషలలో ఈతని పాండిత్యము అద్వితీయమైనది. హిందూ విజ్ఞానమును ఈతడు మిగుల ప్రేమించుచుండెను. ఈయువరాజు మణిఖచితములగు తన ఉంగరముపై 'ప్రభూ అనుపదమును చెక్కించుకొనెవాడు. కాశీనగరమునుండి పెక్కు పండితులను రావించి వారి సాహాయమ్ముచే ఈతడు ఉపనిషత్తులను,భగవద్గీతను,యోగవాసిష్ఠమును పర్షియన్ భాషలోనికి తర్జుమా చేయించినాడు. హిందూ మతమును, సూఫీ మతమును సరిపోల్చుచు ఈతడు రచించిన విమర్సనము మిగుల ప్రశంసనీయమైనది.
వ్యక్తిత్వం
సంపద
షాజహాన్ చక్రవర్తికి ఆభరణాలపై విపరీతమైన ప్రేమ ఉండేది. ఆయన స్వంతనగల ఖరీదు అప్పట్లోనే ఐదు కోట్ల రూపాయలు ఉండేది. రాజకుమారులకు ఇచ్చిన ఆభరణాల ఖరీదు మరో రెండు కోట్ల రూపాయలుగా తేలుతోంది. ఐదుకోట్ల రూపాయల విలువైన స్వంతనగల్లో నిత్యం ధరించే నగల విలువ రెండుకోట్ల రూపాయలుగా ఉండేది. ఇవి నిత్యం అంత:పురంలో పరిచారికల వశంలో చక్రవర్తి ఎప్పుడంటే అప్పుడు ధరించేందుకు తయారుగా ఉండేవి. మిగిలిన మూడుకోట్ల రూపాలయల ఖరీదైన నగలు కూడా కావాల్సినప్పుడు ధరించడానికి గాను ఇతర గదుల్లో బానిసల అధీనంతో ఉండేవి. షాజహాన్ చక్రవర్తి తలపాగాకు చుట్టుకునే బంగారు సరిగపట్టకు గుచ్చిన సర్పేస్ అనే కెంపుల కలికితురాయి విలువే అప్పట్లోనే పన్నెండు లక్షల రూపాయలు ఉండేది.