World Animal Day | ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ౼ వినయ్స్ ఇన్ఫో
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (October 4th) -World Animal Day,ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
అంతరించిపోతున్న అటవీప్రాంతాలు--కనుమరుగైపోతున్న జంతుజాలం--వన్యప్రాణి సంరక్షణలో అటవీశాఖ--
వన్యప్రాణి అంటే మానవుడు మచ్చిక చేసుకోని జంతువులను వన్య ప్రాణులుగా అభివర్ణిస్తారు. ఈ వన్యప్రాణులను సంరక్షించవలెను. దీనికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఎ). వాటి ఉత్పాదనలను జ్ఞానయుతం గా వాడుకోవచ్చును. బి). వీటిని సంఖ్యాపరంగాపర్యావరణం సమతుల్యతలో వుంచవచ్చును. ఈ వన్య ప్రాణులను సంరక్షించడం కోసం ప్రత్యేకమైన సంస్థలు వెలిశాయి. అవి ప్రకృతి వనరుల సంరక్షణ గురించి అంతర్జాతీయ యూనియన్ (ఐయుసిఎన్) మరియు ప్రపంచ వన్య ప్రాణుల నిధి(డబ్ల్యుడబ్ల్యుఎఫ్) అనేవి. వన్యప్రాణులసంరక్షణ రెండు దశలలో చేస్తారు.
మొదటిది భూమిపైన గల భౌతిక పరిసరాలను, మొక్కల సమాజాన్ని కాపాడటం, రెండవది జన్యువు వైవిధ్యం జాగ్రత్తపరచడానికి అన్ని జాతుల మొక్కలను, జంతువులను కాపాడుట. అనేక దేశాల వారు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియచేయడానికి వన్యప్రాణులను జాతీయ జంతువులుగా గుర్తించారు. ఉదా: భారతదేశం-పులి, ఆస్ట్రేలియా-కంగారు వన్యప్రాణుల విలువకు కారణాలు అనేకం. వాటిలో కొన్ని దంతాలు, మాంసం, పరిమళ ద్రవ్యం, ఔషధాలకోసం వాటిని సంహరించడం, అడవుల నరికివేత, ఆనకట్టలు రిజర్వాయర్ల నిర్మాణం, అడవులలో మంటలు, పర్యావరణం కాలుష్యం ఇన్ని కారణాల వలన అనేక జాతులు అంతరించిపోయినవి. భూమి సగటున రోజుకు ఒక జాతిని కోల్పోతుంది. ఇలా అంతరించిపోయే వాటిలో భారతదేశంలో ఈ మధ్యనే అంతరించిపోయిన జీవి చిరుతపులి. అంతర్జాతీయ యూనియన్వారు అంతరించిపోయే అవకాశం వున్న జీవులన్నింటి నుండి ఒక పట్టికను తయారు చేసి దానిని ''రెడ్ డేటా బుక్''లో ప్రచురించడం జరిగింది. అంతర్జాతీయ యూనియన్వారు ఈ సమసిపోయే వన్య ప్రాణులను రెండుగా వర్గీకరించారు.
వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మెతక వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న అరుదైన జంతువులను భవిష్యత్ తరాలకు అందించాలంటే ప్రతి ఒక్కరిలోనూ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్బంగా తిరుపతిలోని ఎస్వీ జూపార్క్పై స్పెషల్ స్టోరీ. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనాభాతోపాటు మనిషి ఆధునిక పోకడల కారణంగా అడవులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళలాడే అటవీప్రాంతాలు రానురాను కుచించుకుపోయి ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. దీంతో అరుదైన జీవ, జంతుజాలాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లూపొడుస్తూ అటవీ ప్రాణుల వేట యధేచ్ఛగా జరుగుతోంది. దుప్పిలు, అడవి పందులు, కుందేళ్ళు, నెమళ్ళు తదితర జంతుజాలాన్ని నిర్ధాక్షిణ్యంగా వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని జంతువుల చర్మాలకు డిమాండ్ పెరగడంతో వాటిని భూస్వాములు, అధికారులకు అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పక్షుల వేట సరేసరి. ఏడాది పొడవునా రక్షిత విదేశీ పక్షులను, అరుదైన జాతి పిట్లను చంపి సమీప సంతల్లో బహిరంగంగానే అమ్ముతుండటం తెలిసిందే. ఈ తరహా అక్రమ వేటను, జంతు మాంస విక్రయాలను అరికట్టి మూగ జీవాల ప్రాణాలు కాపాడాల్సిన వన్యమృగ సంరక్షణ విభాగం, అటవీ శాఖ, మూగ జీవాల సంరక్షణ సంఘాలు చోద్యం చూస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దిగువ స్థాయి సిబ్బంది వేటగాళ్ళ తో కుమ్మక్కై వారిని రక్షించే ప్రయత్నం చేయడములేదని తెలుస్తోంది. ఇందుకు తగిన ప్రతిఫలం అందాల్సిన వారికే క్రమం తప్పకుండా అందుతుండటమే ఈ ఉదాసీనతకు కారణమని భావిస్తున్నారు.
చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీప్రాంతం కూడా క్రమంగా అంతరించిపోతోంది. దీంతో ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన జంతువులు కనుమరుగైపోతున్నాయి. దేశంలోనే అరుదైన జంతువు ''పునుగుపిల్లి''తోపాటు అడవికోళ్ళు, కొండగొర్రెల సంరక్షణ కూడా ఇక్కడే చేపడుతున్నారు.'తిరుపతి అటవీశాఖ అధికారులు అరుదైన జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గతంలో అంతరించిపోయే దశకు చేరుకున్న అడవికోళ్లు, కొండగొర్రెలను రక్షించి వాటి ఉత్పత్తిని పెంచారు.
శేషాచలం అటవీప్రాంతంలో అరుదుగా కన్పించే జంతువులను ఎస్వీ జూపార్క్ అధికారులు పూర్తిస్థాయిలో సంరక్షిస్తున్నారు.
దేశంలో పకృతి సిధ్దంగా ఉన్న అతిపెద్ద జూపార్కుల్లో మెదటిస్ధానంలో ఉన్న తిరుపతి ఎస్వీ జూపార్క్ వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. జంతువుల పరిరక్షణపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిస్తూ అరదైన జంతుజాలాన్ని కాపాడుతోంది. జంతుప్రేమికులు కూడా జంతువులను దత్తత తీసుకుని, వాటి సంరక్షణకు అయ్యే ఖర్చును భరిస్తున్నారు.ఇప్పటికైనా వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి వీడి అరుదైన జంతువులను కాపాడాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.
ప్రపంచంలోని ఎన్నో రకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. మన దేశంలో పులులు, ఏనుగులు వన్య మృగాలు గణనీయంగా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణి చట్టాలను గట్టిగా అమలు పర్చాలని, జంతు బలులు నిషేధించాలని కోరుతున్నారు. వరల్డ్ యానిమల్ డే యాక్డు ప్రకారం జంతువుల ఆకలి, దాహాలు తీర్చాలి, వాటికి ఎటువంటి అసౌకర్యం, బాధ కలిగించ రాదు. వ్యాధులు గాయాల నుండి కాపాడాలి. జంతువులను క్రూరమైన హింస యాతనలనకు గురి చేయరాదు. వర్షం, చలి, ఎండల నుండి కాపాడాలి అంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం.
అడవులు వన్యప్రాణి సంరక్షణ
పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. కానీ, భారతదేశంలో జనాభా విస్ఫోటం వల్ల వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు - రైలు మార్గాల అభివృద్ధి మొదలైన కార్యకలాపాలవల్ల అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతోంది. అడవులు తరగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే sustainable development ను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 1980లో సమగ్ర అడవుల పరిరక్షణ చట్టాన్ని (Forest Conservation1980) రూపొందించింది. పదో పంచవర్ష ప్రణాళికా కాలంలో సమగ్ర అడవుల పరిరక్షణ పథకాన్ని (Integrated Forest Protection Scheme) అమల్లోకి తెచ్చింది. 1988లో అటవీ విధానాన్ని (Forest Policy), 2006లో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చింది. వాతావరణ మార్పు (Climate Change), గ్లోబల్ వార్మింగ్ను నివారించడానికి అడవుల పరిరక్షణ ఎంతో అవసరం. అడవుల పరిరక్షణ, నిర్వహణ అనే అంశం భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉండటంతో అడవులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యతగా నిర్వహిస్తున్నాయి.
భారత బొటానికల్ సర్వే (బి.ఎస్.ఐ.) ప్రకారం దేశంలో మొత్తం 46వేలకు పైగా వృక్షజాతులు ఉన్నాయి. కానీ, ఇటీవల అడవుల విధ్వంసం వల్ల అందులో అనేక వృక్షజాతులు అంతరించే ప్రమాదం ఉంది. భారత జూలాజికల్ సర్వే (జడ్.ఎస్.ఐ.) ప్రకారం దేశంలో మొత్తం 89వేలకు పైగా జంతు జాతులు (species) ఉన్నాయి. వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి, ప్రకృతిసిద్ధమైన వృక్ష, జంతుజాతుల జీవ వైవిధ్యాన్ని (Bio - diversity) కాపాడేందుకు భారత ప్రభుత్వం అడవుల్లోని వృక్షాలను, జంతువులను వాటి సహజ పర్యావరణంలో అభివృద్ధి చేసేందుకు జీవావరణ కేంద్రాలను (Biosphere Reserves) నెలకొల్పింది. ఈ విధంగా దేశంలో మొదటగా ఏర్పాటుచేసింది నీలగిరి జీవావరణ కేంద్రం. దీన్ని 1986లో స్థాపించారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 15 జీవావరణ కేంద్రాలున్నాయి. 2008లో స్థాపించిన గుజరాత్లోని కచ్ కేంద్రం 15వ జీవావరణ కేంద్రం. ఈ 15 జీవావరణ కేంద్రాల్లో భౌగోళికంగా అతి పెద్దది మన్నార్ కేంద్రం. వీటిలో యునెస్కో గుర్తించి, ప్రపంచ జీవావరణ కేంద్రాల నెట్వర్క్లో చేర్చినవి నాలుగు. అవి: 1) సుందర్బన్స్, 2) మన్నార్, 3) నీలగిరి, 4) నందాదేవి. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకోసం దేశవ్యాప్తంగా 99 జాతీయ పార్కులు, 513 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను స్థాపించారు. ఆంధ్రప్రదేశ్లో అయిదు జాతీయ పార్కులు ఏర్పాటయ్యాయి. ఇక పెద్దపులుల సంరక్షణ, అభివృద్ధికి కేంద్రప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 17 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ ప్రాజెక్టుకు రాజీవ్గాంధీ టైగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.